Chandrababu Naidu: కొందరు గుర్తింపు, గౌరవం కావాలనుకుంటారు... కానీ!: సీఎం చంద్రబాబు

- ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు పర్యటన
- బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి హాజరు
- అనంతరం మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్న వైనం
సమాజానికి ఏదైనా మంచి చేసినప్పుడు తృప్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుర్తింపు, గౌరవం కావాలని కొందరు అనుకుంటుంటారు... డబ్బుతో ఎప్పుడూ గౌరవం రాదు... సమాజానికి మంచిపని చేస్తేనే గౌరవం, గుర్తింపు లభిస్తుంది... అని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గ్రామంలో 41 పేద కుటుంబాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రజా వేదిక సభలో బంగారు కుటుంబ సభ్యుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్గదర్శి గోగినేని రవిచంద్రను సన్మానించారు. అనంతరం సీఎం మాట్లాడారు.
ప్రపంచంలోనే అద్భుత కార్యక్రమం పీ4
‘మార్గదర్శి-బంగారు కటుంబం’ ఒక చరిత్రాత్మక కార్యక్రమం. ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంతో పాటు ఆర్థిక సంస్కరణలు కూడా తీసుకొచ్చాయి. పేదరికం వెంట తెచ్చుకుంటే వచ్చేది కాదు. కొందరు తరతరాలు పేదరికంలోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. పీ4 ద్వారా పేదలకు సహకారం అందుతుంది.
భారతరాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్కు ఆ రోజుల్లో బరోడా మహారాజు ఆర్థిక సహకారం అందించారు. లండన్ వెళ్లి చదువుకోవడానికి చేయూతనిచ్చారు. దేశం మెచ్చుకునే మేధావిగా అంబేద్కర్ తయారయ్యారు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి వెనక కూడా అయ్యంగార్ ఉన్నారు. కలాంను అయ్యంగార్ శిష్యుడిగా దగ్గరకు తీసుకుని గణితం, సైన్స్ నేర్పించి శాస్త్రవేత్త అవ్వడానికి సాయపడ్డారు. వివేకానందను రామకృష్ణ పరమహంస తీర్చిదిద్దారు... అని సీఎం వివరించారు.
పేద పిల్లలు పైకి ఎదగాలి
స్వాతంత్ర్య సమరయోధులు గాంధీ అయినా, ఎన్టీఆర్, మోదీ, నేను చిన్న కుటుంబాల్లోనే పుట్టాం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అంచలంచెలుగా ఎదిగాం. మీ పిల్లలు కూడా ఇదే విధంగా పైకి రావాలి. అందుకే ఈ పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పేద కుటుంబాలను పేదరికం నుంచి పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పీ4 తెచ్చాం. ఈ గ్రామంలో గుర్తించిన 41 బంగారు కుటుంబాలతో పాటు ఎవరైనా బంగారు కటుంబంలో చేరే వారికి అవకాశం కల్పిస్తాం. బాగా చేసిన మార్గాదర్శులను గౌరవించి, సన్మానిస్తాం... అని సీఎం చంద్రబాబు అన్నారు.
మార్గదర్శులు మాట్లాడుతూ...
తోటకూరి శ్రీనివాసరావు, గ్రీన్ వే గ్రూప్ ఆఫ్ కంపెనీ
పరిటాలలో మేము బ్రిక్స్ ఫ్యాక్టరీ పెట్టాం. జన్మభూమి కార్యక్రమం రూపంలో పీ4 వచ్చింది. మేం ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నాం. ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురితో మాట్లాడి నాలుగైదు కటుంబాలు దత్తత తీసుకునేలా చేస్తాం. మాకు దాదాపు 500 కన్సల్టెన్సీలతో సంబంధాలు ఉన్నాయి. డిజిటల్ మార్కెట్లో ఈ పీ4 ప్రమోట్ చేస్తాం. ఒక 1000 కుటుంబాలు బంగారు కుటుంబంలో ఎంపికయ్యేందుకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తాను.
జయేష్ కుమార్ షా, ట్విల్స్ క్లాతింగ్ ఇండియా డైరెక్టర్
మేం ఈ నేలపై పుట్టి పెరిగాం. మాకు ఈ జన్మభూమి చాలా ఇచ్చింది. వచ్చిన అవకాశాలతో వ్యాపారం చేసి పైకి ఎదిగాం. మాకు ఎంతో ఇచ్చిన ఈ సమాజానికి తిరిగి ఇచ్చే బాధ్యత ఉంది. ఈ పీ4 గురించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చెప్పినప్పుడు చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. నాకు ఏ బాధ్యత అప్పగించినా తప్పకుండా ముందుకు తీసుకెళ్తాను.
మధుసూధన్ రావు, కేసీపీ ఇండియా షుగర్ ఫ్యాక్టరీ ప్రతినిధి
ఈ పీ4 వినూత్న కార్యక్రమం. దేశంలోనే ఇది మొట్టమొదటి కార్యక్రమం. పేదరిక నిర్మూలన కోసం మీరు వేసిన అడుగులో మేం అడుగుల వేస్తాం. ముక్త్యాల గ్రామాన్ని మేం దత్తత తీసుకున్నాం. గ్రామంలో 800 మందికి హెల్త్ కార్డులు అందించాం. ముప్పాలలో వేల్పుల మణెమ్మ కుటుంబాన్ని దత్తత తీసుకుంటాం. ఆ కుటుంబంలోని విద్యార్థులకు విద్యకు అవసరమైన సాయాన్ని అందిస్తాం.
వల్లభనేని రామకృష్ణ, అంబా కోచ్ బిల్డర్స్
మీ స్ఫూర్తితో మేం ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటాం. విద్య, వైద్యానికి సంబంధి కుటుంబ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం.