Elon Musk: 'ఎక్స్'ను అమ్మేసిన‌ ఎలాన్ మ‌స్క్.. ఎంత‌కు, ఎవ‌రికో తెలుసా?

Elon Musk Sells X Twitter for 33 Billion
షార్ట్స్‌లో చూడండి
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్ర‌పంచ‌కుబేరుడు ఎలాన్ మ‌స్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)ను విక్రయించినట్టు మస్క్ ప్రకటించారు. అయితే, బయట వ్యక్తులకు మాత్రం కాదు. మస్క్ ఏఐ స్టార్టప్ కంపెనీ ‘ఎక్స్ ఏఐ’కు విక్రయించారు. ఈ మేరకు ఎక్స్‌లో మస్క్ పోస్ట్ చేశారు. 

మొత్తం 33 బిలియన్ డాలర్ల (రూ. 2.80 లక్షల కోట్లు)కు ఎక్స్‌ను అమ్మినట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం ‘ఎక్స్ ఏఐ’ విలువను 80 బిలియన్ డాలర్లుగా మస్క్ పేర్కొన్నారు. అధునాత ఏఐ టెక్నాలజీని 'ఎక్స్‌'కు అనుసంధానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మస్క్ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం 'ఎక్స్‌'కు 600 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.  

కాగా, టెస్లా, స్పేస్‌ఎక్స్‌లకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారుగా పనిచేస్తున్న మస్క్ 2022లో 'ట్విట్టర్' అనే సోషల్ మీడియా సైట్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం దాని పేరును 'ఎక్స్'గా మార్చారు. 'ఎక్స్'ను కొనుగోలు చేసిన త‌ర్వాత‌ సిబ్బందిని తొలగింపు, ద్వేషపూరిత ప్రసంగాలు, వినియోగదారు ధృవీకరణ త‌దిత‌ర అంశాలు అప్ప‌ట్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఇక 'ఎక్స్ ఏఐ'ను రెండేళ్ల కిందటే మస్క్ ప్రారంభించారు. "ఈరోజు మేము అధికారికంగా డేటా, మోడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్, ప్రతిభను అనుసంధానం చేయడానికి ముందడుగు వేస్తున్నాం. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని మరింత వేగవంతం చేసే సమర్ధవంతమైన వేదికను నిర్మించడానికి మాకు వీలు కల్పిస్తుంది" అని మస్క్ త‌న పోస్టులో పేర్కొన్నారు.
Go Back to Shorts
Elon Musk
X
Twitter
X AI
Tesla
SpaceX
Social Media
AI
Artificial Intelligence
33 Billion Dollars

More Telugu News