యువ ఓపెన‌ర్ యశస్వి జైస్వాల్ మ‌రో ఘ‌న‌త‌

  • టీ20ల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డ్‌
  • కేవలం 102 ఇన్నింగ్స్‌లలో 3000 పరుగులు పూర్తి చేసిన యంగ్ ప్లేయ‌ర్‌
  • ఈ జాబితాలో తిలక్ వర్మ (90 ఇన్నింగ్స్‌ లు) అగ్ర‌స్థానం
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యువ‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. 23 ఏళ్ల ఈ స్టార్ ప్లేయ‌ర్‌ కేవలం 102 ఇన్నింగ్స్‌లలో 3000 పరుగులు పూర్తి చేశాడు. 

కాగా, ఈ జాబితాలో తెలుగు ఆట‌గాడు తిలక్ వర్మ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌డు కేవ‌లం 90 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఆ త‌ర్వాత‌ రుతురాజ్ గైక్వాడ్ (91), కేఎల్ రాహుల్ (93) ఉన్నారు. జైస్వాల్ నాలుగో స్థానంలో ఉంటే... గిల్ (103) ఐదో స్థానంలో ఉన్నాడు. 

నిన్న‌ బరస్పరా క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ 29 ర‌న్స్ చేసిన విష‌యం తెలిసిందే. త‌ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ ఓట‌మి పాలైంది. ఆర్ఆర్‌ను కేకేఆర్ 8 వికెట్ల తేడాతో మ‌ట్టిక‌రిపించింది.


More Telugu News