డీలిమిటేషన్ కు మేం వ్యతిరేకం... దక్షిణాది రాష్ట్రాలకు విలువలేకుండా పోతుంది: కేటీఆర్
- చెన్నైలో కాసేపట్లో డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం
- తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన భేటీ
- డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందన్న కేటీఆర్
చెన్నైలో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ... డీలిమిటేషన్ కు తాము పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెపుతోందని... డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం విలువలేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు భారీగా పెరుగుతాయని... అప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదని అన్నారు.
దేశ జనాభాలో 2.8 శాతం జనాభా ఉన్న తెలంగాణ... దేశ జీడీపీలో 5.1 శాతం సమకూర్చుతోందని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే అన్ని ట్యాక్స్ ల పేరుతో తెలంగాణ నుంచి రూపాయి తీసుకుని... 25 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోందని విమర్శించారు. డీలిమిటేషన్ తో నిధుల పరంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర వివక్షకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.