డీలిమిటేషన్ కు మేం వ్యతిరేకం... దక్షిణాది రాష్ట్రాలకు విలువలేకుండా పోతుంది: కేటీఆర్

KTR Condemns Delimitation
  • చెన్నైలో కాసేపట్లో డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం
  • తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన భేటీ
  • డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందన్న కేటీఆర్
డీలిమిటేషన్ పై కాసేపట్లో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభంకానుంది. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్ లో ఈ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్... బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. వీరంతా ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. 

చెన్నైలో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ... డీలిమిటేషన్ కు తాము పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెపుతోందని... డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం విలువలేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు భారీగా పెరుగుతాయని... అప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదని అన్నారు. 

దేశ జనాభాలో 2.8 శాతం జనాభా ఉన్న తెలంగాణ... దేశ జీడీపీలో 5.1 శాతం సమకూర్చుతోందని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే అన్ని ట్యాక్స్ ల పేరుతో తెలంగాణ నుంచి రూపాయి తీసుకుని... 25 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోందని విమర్శించారు. డీలిమిటేషన్ తో నిధుల పరంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర వివక్షకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
KTR
K.T. Rama Rao
Delimitation
South Indian States
Telangana
BJP
Reorganisation
All Party Meeting
Chennai
Political Crisis

More Telugu News