అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు

  • అమెరికాలో పలు చోట్ల టోర్నడోల బీభత్సం
  • కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చులు
  • 10 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాలో భీకరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పెనుగాలులు, టోర్నడోలు, కార్చిచ్చుల కారణంగా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ విపత్తుల కారణంగా ఇప్పటివరకు 10 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.

మిస్సోరీలోని బేకర్స్‌ఫీల్డ్‌ ప్రాంతంలో టోర్నడో బీభత్సంతో ఇద్దరు మృతి చెందగా, టెక్సాస్‌ పాన్‌హ్యాండిల్‌లోని అమరిల్లో కౌంటీలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మిస్సోరీలో టోర్నడోల ప్రభావంతో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. అలబామా, కెంటకీ, మిసిసిపీ, టెనసీ, ఇల్లినోయీ, ఇండియానా, టెక్సాస్‌, టెన్నెసీ రాష్ట్రాలకు టోర్నడోల ప్రమాదం పొంచి ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరించింది.

గంటకు 130 కిలోమీటర్ల వేగంతో కెనడా సరిహద్దు నుంచి టెక్సాస్ వరకు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఓక్లహోమా, మిస్సోరీ, న్యూ మెక్సికో, టెక్సాస్‌, కాన్సస్‌లలో కార్చిచ్చులు వ్యాపిస్తుండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

మిన్నెసొటా, సౌత్‌ డకోటాలోని కొన్ని ప్రాంతాలకు మంచు తుపాను హెచ్చరికలు జారీ చేశారు. మార్చి నెలలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు సాధారణమే అయినప్పటికీ, ఈసారి తీవ్రత ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.


More Telugu News

USA Nature Disasters Tornado Wildfire