2028 నాటికి అమరావతి పూర్తవుతుంది: అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన

  • ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రశ్న
  • సమాధానమిచ్చిన మంత్రి నారాయణ
  • రాజధాని నిర్మాణానికి రూ.64,721 కోట్ల వ్యయం అవుతుందని వివరణ
ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతి నిర్మాణంపై నేడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అమరావతి నిర్మాణం 2028 నాటికి పూర్తవుతుందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి రూ.64,721 కోట్ల ఖర్చవుతుందని వెల్లడించారు. 

నాడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో అమరావతి రైతులు భూములు ఇచ్చారని... రైతులు 58 రోజుల వ్యవధిలోనే 34 వేల ఎకరాలు ఇచ్చారని వివరించారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్లలో రైతులకు అప్పగిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. టాప్-5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారని తెలిపారు. 

అమరావతిలో ప్రధాన రోడ్లను రెండేళ్లలో పూర్తి చేస్తామని, మూడేళ్లలో ఎల్బీఎస్ రోడ్లు పూర్తి చేస్తామని, మూడేళ్లలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాలు పూర్తవుతాయని, ఏడాదిన్నరలో అధికారుల భవనాలు పూర్తి చేస్తామని వివరించారు. 

గతంలో అమరావతిలో 131 సంస్థలకు 1,277 ఎకరాలు కేటాయించామని... కానీ గత  ఐదేళ్లలోని పరిస్థితుల దృష్ట్యా వాటిలోని కొన్ని సంస్థలు వెనక్కి వెళ్లాయని మంత్రి నారాయణ చెప్పారు.



Amaravati
AP Capital
P Narayana
Sujana Chowdary
AP Assembly Session

More Telugu News