రెండో రోజు కొనసాగిన నిరాశ: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం

  • అరసవెల్లిలో సూర్యకిరణ స్పర్శకు ఆటంకం
  • రెండో రోజు నిరాశతో భక్తుల తిరుగుముఖం 
  • పొగమంచు, మేఘాలే కారణం
  • ఉత్తరాయణ, దక్షిణాయణంలో కిరణ స్పర్శ ఆనవాయితీ
  • ఆదివారం రూ. 8.54 లక్షల ఆదాయం
శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన భక్తులకు వరుసగా రెండో రోజు కూడా నిరాశ ఎదురైంది. సోమవారం ఉదయం కూడా సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను తాకలేకపోయాయి. ప్రతి సంవత్సరం రెండుసార్లు జరిగే ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే పొగమంచు, మేఘాలు ఆటంకం కలిగించాయి.

ఆదివారం కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఉత్తరాయణ, దక్షిణాయణ కాలాల్లో మార్పుల సమయంలో, ప్రతి సంవత్సరం మార్చి 9, 10 మరియు అక్టోబర్ 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి విగ్రహాన్ని తాకడం ఆనవాయితీగా వస్తోంది.

ఆదివారం సెలవు దినం కావడంతో, సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయని భావించి వేలాదిగా భక్తులు ఉదయం 6 గంటలకే ఆలయానికి చేరుకున్నారు. భక్తులు సూర్యకిరణాల కోసం వేచి చూసినప్పటికీ, మేఘాల కారణంగా కిరణ స్పర్శ జరగలేదు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని, ఇంద్రపుష్కరిణిలో స్నానాలు ఆచరించి, రావిచెట్టుకు పూజలు చేశారు. కొందరు భక్తులు క్షీరాన్నం వండి స్వామికి నైవేద్యంగా సమర్పించారు. ఆదివారం ఒక్కరోజే ఆలయానికి రూ.8,54,950 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.



More Telugu News

arasavalli Suryanarayana Temple Sun Rays