ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశాం: హైదరాబాద్ వాతావరణ శాఖ

  • ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నట్లు తెలిపిన వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు
  • మార్చి నెలాఖరు నాటికి ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడి
  • ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వడగాలులు వీస్తాయన్న అధికారి
దక్షిణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉందని, ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వెల్లడించారు. మార్చి ప్రారంభంలోనే తెలంగాణలో ఉష్ణోగ్రతలు సుమారు 40 డిగ్రీలకు చేరుకున్నట్లు తెలిపారు.

మార్చి నెలాఖరు నాటికి ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాలులు వీస్తాయని వెల్లడించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మంలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 నుండి 39 డిగ్రీల మధ్య నమోదవుతోందని అన్నారు.

ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు, నిన్న ఉష్ణోగ్రతలు అతి స్వల్పంగా తగ్గినప్పటికీ, మున్ముందు పెరుగుతాయని చెప్పారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణస్థాయి కంటే ఒకటి రెండు డిగ్రీలు అధికంగా ఉన్నాయని చెప్పారు. మార్చి చివరి రెండు వారాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉండవచ్చని తెలిపారు. 


More Telugu News

IMD Telangana Hyderabad