కర్ణాటక మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా అందించిన బాలీవుడ్ హీరో

  • ఆలయ పూజాకార్యక్రమాలలో వినియోగించేందుకు అప్పగింత
  • పెటా సంస్థతో కలిసి మూగజీవాల పరిరక్షణకు కృషి చేస్తున్న సునీల్ శెట్టి
  • ఒక్కో రోబోటిక్ ఏనుగుకు రూ.17 లక్షలు ఖర్చవుతుందంటున్న పెటా
కర్ణాటకలోని ధావణగెరె శిలామఠం నిర్వాహకులు ఆదివారం రోబోటిక్ ఏనుగుకు స్వాగతం పలికారు. మేళతాళాలతో గ్రామంలో ఊరేగించారు. ఆ రోబోటిక్ ఏనుగుకు ఉమామహేశ్వర్ అని పేరు పెట్టారు. ముంబైకి చెందిన కుపా సంస్థతో కలిసి మూగజీవాల పరిరక్షణకు కృషి చేస్తున్న ‘పెటా’ సంస్థ తరఫున బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఈ రోబోటిక్ ఏనుగును మఠానికి విరాళంగా అందించారు. ఆలయ సంప్రదాయాల్లో భాగంగా ఏనుగును వినియోగిస్తుంటారు. దీనికోసం అటవీ ఏనుగులను బంధించి, శిక్షణ ఇస్తుంటారని పెటా ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే నిజమైన ఏనుగులను తలపించేలా రోబో ఏనుగులను తయారుచేయించి ఆలయాలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు ఆలయాలకు, మఠాలకు అందించామని చెప్పారు. దీనివల్ల ఆలయ సంప్రదాయలు కొనసాగిస్తూనే ఏనుగులను సంరక్షించుకోవచ్చని చెప్పారు. ఒక్కో రోబో ఏనుగును తయారుచేయడానికి రూ.17 లక్షల వరకు ఖర్చవుతుందని వివరించారు. థాకర్సే సంస్థ ఇందుకు నిధులు సమకూరుస్తోంది. ఆ మధ్యన శిల్పాశెట్టి కూడా చిక్కమగళూరు జిల్లాలోని రంభపురి మఠానికి ఇలాగే రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చారు.

Suniel Shetty
Robo Elephant
Temple
Karnataka

More Telugu News