దాయాదుల పోరుకు రికార్డుస్థాయి వ్యూస్‌.. నంబ‌ర్ వ‌న్‌గా నిలిచిన హైవోల్టేజ్ మ్యాచ్!

  • ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్ 
  • విరాట్ కోహ్లీ అద్వితీయ సెంచరీతో టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ
  • జియో హాట్‌స్టార్‌లో 60.2 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించిన వైనం
  • భార‌త్ ల‌క్ష్య‌ ఛేద‌న‌కు దిగిన‌ స‌మ‌యంలో 33.8 కోట్లుగా ఉన్న వ్యూస్‌
ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదిక‌గా భార‌త్‌, పాక్ మ‌ధ్య ఆదివారం జ‌రిగిన హైవోల్టేజ్ మ్యాచ్ వ్యూస్ ప‌రంగా నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. జియోహాట్‌స్టార్‌లో దాయాదుల పోరుకు ఏకంగా 60.2 కోట్ల రికార్డు స్థాయి వ్యూస్ వ‌చ్చాయి. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన స‌మ‌యంలో 6.8 కోట్లు ఉన్న వ్యూస్.. ఆ జ‌ట్టు ఆఖ‌రి ఓవ‌ర్ ఆడుతున్న స‌మ‌యంలో వీక్షకుల సంఖ్య 32.1 కోట్లకు చేరింది. ఇక పాక్ ఇన్నింగ్స్ బ్రేక్ అయిన‌ సమయంలో 32.2 కోట్లకు చేరుకుంది.

ఇక భార‌త్ ల‌క్ష్య‌ ఛేద‌న‌కు దిగిన‌ స‌మ‌యంలో 33.8 కోట్లుగా ఉన్న వ్యూస్‌.. విరాట్ కోహ్లీ శ‌త‌కం చేసి మ్యాచ్‌ను గెలిపించే స‌మ‌యానికి 60.2 కోట్ల‌కు చేరి రికార్డు సృష్టించింది. గ‌తంలో ఏ క్రికెట్ మ్యాచ్‌కూ ఇన్ని వ్యూస్ రాలేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ఇంత‌కుముందు 2023 ఐసీసీ వ‌న్డే ప్రపంచ కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డినప్పుడు డిస్నీ ప్ల‌స్‌ హాట్‌స్టార్‌లో అత్యధికంగా 3.5 కోట్ల వ్యూస్‌ నమోద‌య్యాయి. అంత‌కుముందు ఆసియా కప్‌లో దాయాదుల పోరును గరిష్ఠంగా 2.8 కోట్ల మంది వీక్షించారు. 

కాగా, నిన్న‌టి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరోసారి బ్యాట్ ఝుళిపించిన విష‌యం తెలిసిందే. అద్భుత‌మైన అజేయ శ‌త‌కం (100)తో టీమిండియాకు గ్రాండ్ విక్ట‌రీని అందించాడు ర‌న్ మెషీన్. ఇక ఈ సెంచ‌రీతో పలు రికార్డుల‌ను సైతం త‌న ఖాతాలో వేసుకున్నాడు.  


More Telugu News