ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్.. 31 మంది మావోయిస్టుల మృతి

  • కొనసాగుతున్న ఎదురుకాల్పులు
  • బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ సమీపంలో ఘటన
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ఛత్తీస్ గఢ్ లో ఆదివారం ఉదయం మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరగగా 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. తొలుత 12 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే, ఘటనా స్థలంలో మరిన్ని మృతదేహాలను గుర్తించామని, ఇప్పటి వరకు 31 మంది చనిపోయారని వివరించారు.

భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు గాయపడ్డారని సమాచారం. ఘటనా స్థలం నుంచి కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బృందాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి.

ఇటీవల ఒడిశా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. కుల్హాడీఘాట్ లో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. తాజాగా ఆదివారం చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో బీజాపూర్ జిల్లాలో 31 మంది మావోయిస్టులు మరణించారు. కాగా, తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


More Telugu News

Chattisgarh Encounter Maoists Security Forces STF DRG