ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించి ఉండాల్సిందేనన్న న్యాయస్థానం
- నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదని వ్యాఖ్య
- కేసును కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం
తాజా కేసులో ఘటన నాలుగు గోడల మధ్య జరిగిందని, అది జరిగిన తర్వాత ఫిర్యాదుదారుడి సహచరులు ఘటనా స్థలానికి చేరుకున్నారని ఎఫ్ఐఆర్ పేర్కొనడాన్ని న్యాయస్థానం ఎత్తిచూపింది. కేసుకు కారణమైన ఘటన అందరూ చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో జరగలేదని పేర్కొన్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్తో కూడిన ధర్మాసనం కేసును కొట్టివేసింది. అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(1) (ఎస్) కింద నేరం రుజువు కావాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించి ఉండాలని స్పష్టం చేసింది.