నేను కొడితే మామూలుగా ఉండదు: రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ వార్నింగ్

KCR warning to Congress govt
  • మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానన్న కేసీఆర్
  • రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయని విమర్శ
  • ఎవడో చెప్పిన మాటలు విని ప్రజలు ఓటేశారని వ్యాఖ్య
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను మౌనంగా, గంభీరంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటు అని చెప్పారు. ఫిబ్రవరి నెల చివర్లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో జహీరాబాద్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయని కేసీఆర్ విమర్శించారు. కాళేశ్వరం, బసవేశ్వరం, సంగమేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రభుత్వం ఎందుకు ఆపిందని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుపై దండయాత్ర చేయాలని హరీశ్ రావుకు చెపుతున్నానని అన్నారు. 

ఎవడో చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓటు వేశారని... తెలంగాణకు మంచి గుణపాఠం జరిగిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కైలాస ఆటలో పైకి పోయిన తర్వాత పెద్ద పాము మింగినట్టు రాష్ట్ర పరిస్థితి తయారయిందని అన్నారు. కరోనా సమయంలో కూడా తాను రైతు బంధు ఇచ్చాని, రైతుల కోసం ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చానని... ఇప్పుడు అంతా గంగలో కలిసిపోయిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిందని... రాజకీయాల కోసం పుట్టింది కాదని అన్నారు.
Go Back to Shorts
KCR
BRS
Harish Rao

More Telugu News