Ratha Saptami: రథ సప్తమి సందర్భంగా సిఫారసు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు: టీటీడీ

ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. రథసప్తమి నేపథ్యంలో, ఇవాళ్టి టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రథసప్తమి సందర్భంగా సిఫారసు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. రథసప్తమి రోజున శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 

సిఫారసు లేఖల దర్శనాల రద్దుతో పాటు, తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లు కూడా రద్దు చేస్తున్నట్టు బీఆర్ నాయుడు వివరించారు. నేరుగా వచ్చే భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా అనుమతిస్తామని వెల్లడించారు.  పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.  
మాఢవీధుల్లో వాహన సేవలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మాఢ వీధుల్లో భక్తులకు ఎండ, చలి నుంచి రక్షణకు ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ నాయుడు తెలిపారు. రథసప్తమికి భారీగా తరలి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచాలని నిర్ణయిచామని పేర్కొన్నారు. 

కాగా, రథసప్తమి పర్వదినం సందర్భంగా 2 లక్షల మందికి పైగా భక్తులు తిరుమల వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఏడు వాహనాలపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
Ratha Saptami
Tirumala
TTD

More Telugu News