కుంభమేళా మృతులకు పరిహారం ప్రకటించిన యూపీ సర్కారు

  • కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది భక్తుల దుర్మరణం
  • మృతుల కుటుంబాలకు 25 లక్షల వంతున సహాయాన్ని ప్రకటించిన సీఎం యోగి
  • దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళలో తొక్కిసలాట జరిగి 30 మంది మృత్యువాత పడగా, మరో 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై యోగి సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది. అలాగే మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 

ఈ ఘటనపై మంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు. ఘటన మొత్తాన్ని న్యాయ కమిషన్ పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తుందని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వయంగా ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి సమస్యలన్నింటినీ పరిశీలిస్తారని పేర్కొన్నారు. 
 
కాగా, మౌని అమావాస్య కావడంతో బుధవారం మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. మౌని అమావాస్య రోజున అమృత స్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం, ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున భక్తులు గుమికూడటంతో కొందరు బారికేడ్లను బద్దలు కొట్టారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. మరోపక్క మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. 

maha kumbh
Prayagaraj
judicial probe
CM Yogi

More Telugu News