రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

  • రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డుల అంశంపై లేఖ
  • అర్హులందరికీ పథకాలు అందకపోవడం దారుణమని వ్యాఖ్య
  • ఇచ్చిన వాగ్ధానాలలో ఒక్కటీ అమలు కాలేదన్న బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డుల అంశంపై ఈ లేఖ రాశారు. అర్హులందరికీ పథకాలు అందకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులు ఉంటే, ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 10 లక్షల మంది వరకు వ్యవసాయ కూలీలు ఉన్నారని, కానీ 9 లక్షల 79 వేల మంది ఖాతాల్లో ఇప్పటిదాకా డబ్బులు వేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని అర్హులందరికీ రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని ఆ లేఖలో బండి సంజయ్ కోరారు. జనవరి 26 నుంచి నాలుగు పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, కనీసం మూడు శాతం మందికి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆయన అన్నారు.

ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలు ఉండగా, మండలానికి ఒక్కో గ్రామం చొప్పున 561  గ్రామాలకు మాత్రమే పథకాలను మంజూరు చేయడం విస్మయం కలిగిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించి, నిన్నటి వరకు 42,267 మందిని మాత్రమే గుర్తించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షలమంది పేదలు ఇళ్లకు అర్హులని ప్రభుత్వం గుర్తించిందని, కానీ ఇప్పటివరకు 72 వేల మందికి మాత్రమే ఇళ్లను మంజూరు చేయడం సరికాదని పేర్కొన్నారు.


More Telugu News

Revanth Reddy Bandi Sanjay BJP