తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ

  • ఈ నెల 8న తిరుపతి పద్మావతి పార్క్ వద్ద తొక్కిసలాట ఘటన
  • జ్యుడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్
  • జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణ
ఇటీవల తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాడు జరిగిన ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఏపీ సర్కార్ జ్యుడిషియల్ విచారణ కమిషన్‌ను నియమించింది.

హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సదరు ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. 
 
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీకి తిరుపతి పద్మావతి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో ఈ నెల 8న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు దుర్మరణం చెందడంతో పాటు మరికొందరు గాయపడటంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణించారు. వీరు తిరుపతికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. 

ఘటన జరిగిన తీరుపై బాధితులు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. న్యాయ విచారణకు ఆదేశిస్తామని నాడు సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పటికప్పుడు పలువురు అధికారులపై సస్పెన్షన్, బదిలీ వేటు వేశారు. నాడు బాధితులకు ఇచ్చిన హామీ మేరకు తాజాగా ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

Tirupati stampede Incident
Tirupati
andhra pradesh Government
judicial inquiry

More Telugu News