షిర్డీలో ఘోర రోడ్డు ప్రమాదం.... తెలంగాణ భక్తుల కన్నుమూత

  • దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదం 
  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
  • గాయపడిన మరో ఎనిమిది మంది ఆసుపత్రికి తరలింపు
  • మృతులు యాదాద్రి భువనగిరి జిల్లా కొండగడప వాసులుగా గుర్తింపు
మహారాష్ట్రలోని షిర్డీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన కొందరు రెండు రోజుల క్రితం సాయిబాబాను దర్శించుకోవడం కోసం షిర్డీ వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా, వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురయింది.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ప్రేమలత (59), ప్రసన్న లక్ష్మి (45) అక్షిత (20), వైద్విక్ నందన్ (6నెలలు) మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదం కారణంగా దుర్మరణం చెందడంతో కొండగడప గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 


More Telugu News