రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం: నారా లోకేశ్
- కోటి దాటిన టీడీపీ సభ్యత్వాలు
- కార్యకర్తలకు బహిరంగ లేఖ రాసిన నారా లోకేశ్
- నేడు టీడీపీ కోటి మందితో కూడిన కుటుంబంలా తయారైందని వెల్లడి
- కార్యకర్తలే తమ బలం, బలగం అని ధీమా
"విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతిపెద్ద కుటుంబంగా తయారైంది. సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏపీ, తెలంగాణ, అండమాన్ సహా అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు. గత రికార్డులు తిరగరాస్తూ, కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించాం" అని నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం, బలగం అని పేర్కొన్నారు. పసుపు జెండా అంటే మనకు ఒక ఎమోషన్ అని తెలిపారు. అధినేత చంద్రబాబు పార్టీలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా కార్యకర్తలతో చర్చించిన తర్వాతే ప్రకటిస్తారని లోకేశ్ వెల్లడించారు.
"మంచి నిర్ణయం తీసుకుంటే పొగిడేది మీరే... ఏదైనా నిర్ణయం నచ్చకపోతే ప్రశ్నించేది మీరే... అందుకే పార్టీలోని ప్రతి కార్యకర్త అధినేతే. కార్యకర్తల సంతోషమే చంద్రబాబుకు ఆనందం. ఆయన నాతో మాట్లాడిన ప్రతిసారి కార్యకర్తల ప్రస్తావన ఉంటుంది. ఇక, పార్టీలో లైఫ్ టైమ్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అంటూ లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు.