ఛాంపియ‌న్స్ ట్రోఫీకి భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే..!

  • ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ప్రకటన ఈ నెల 18 లేదా 19న‌
  • ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఇవాళ లేదా రేపు జట్టు ప్రకటన‌
  • మ‌హ్మ‌ద్‌ షమీ వన్డే జట్టులోకి పున‌రాగ‌మ‌నం
  • అటు వన్డేల్లో అర్ష్‌దీప్‌ సింగ్‌కు అవకాశం
పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌ల్లో ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. అయితే, ఛాంపియ‌న్స్ ట్రోఫీకి భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఆల‌స్యం కానున్న‌ట్లు 'క్రిక్‌బ‌జ్' పేర్కొంది. ఈ నెల 12లోపు టీమ్‌ను ప్ర‌క‌టించాల్సి ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు బీసీసీఐ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ క్ర‌మంలో ఐసీసీని గ‌డువు పొడిగించాల‌ని బీసీసీఐ అభ్య‌ర్థించిన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన ఆలస్యం కావచ్చు. ఈ నెల 18 లేదా 19న జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఉంటుందని స‌మాచారం.

ఇక ఇంగ్లండ్ తో స్వ‌దేశంలో వైట్-బాల్ సిరీస్ కోసం ఇవాళ లేదా రేపు జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఉండే అవ‌కాశం ఉంది. ముందుగా ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ క‌మిటీ జ‌ట్టును ప్ర‌క‌టించ‌నుంది. సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్సీలో భార‌త జ‌ట్టు ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. మొత్తం ఐదు టీ20లు ఆడ‌నుంది. ఆ త‌ర్వాత మూడు వ‌న్డేలు ఆడ‌నుంది.

ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పరాజయం తర్వాత జట్టు ఎంపిక విషయంలో చాలా కఠినమైన నిర్ణ‌యాలు తీసుకునే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ నేప‌థ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారిని ఎంపిక చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే  ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం మహ్మద్ షమీ పునరాగమనం చేసే అవకాశం ఉండగా, అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా 50 ఓవర్ల జట్టులోకి తీసుకోవచ్చని స‌మాచారం. 


More Telugu News