అయ్యప్ప సొసైటీలో ఐదంతస్తుల భవనం కూల్చివేస్తున్న హైడ్రా

  • గతేడాదే యజమానికి నోటీసులు జారీచేసిన జీహెచ్ఎంసీ
  • ప్రధాన రహదారికి పక్కనే అక్రమంగా నిర్మించినట్లు తేల్చిన హైడ్రా
  • ఆదివారం ఉదయం బుల్డోజర్లతో బిల్డింగ్ కూల్చివేత షురూ
మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేస్తోంది. శనివారం ఈ భవనాన్ని పరిశీలించిన హైడ్రా చీఫ్ రంగనాథ్, ఇతర అధికారులు.. ఆదివారం ఉదయం భారీ బుల్డోజర్లతో వచ్చి కూల్చివేత పనులు ప్రారంభించారు. అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ రోడ్ కు ఆనుకుని ఉన్న ఈ భవనం అక్రమ కట్టడమని హైడ్రాతో పాటు హైకోర్టు కూడా ఇప్పటికే నిర్ధారించింది. బిల్డింగ్ యజమానికి గతేడాదే నోటీసులు జారీ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు ఆదివారం ఉదయం బిల్డింగ్ కూల్చివేత పనులు మొదలు పెట్టారు.

మరోవైపు, సోమవారం నుంచి హైడ్రాలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం బుద్ధ భవన్ లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుదారులు ఆధారాలతో రావాలని హైడ్రా సూచించింది. ముందుగా వచ్చిన 50 మందికి టోకెన్స్ ఇచ్చి.. దాని ప్రకారం ఫిర్యాదులు స్వీకరిస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

HYDRA
Madhapur
Ayyappa society
Building
Demolition

More Telugu News