భారత ఆటగాళ్లను గేలి చేసిన ఫ్యాన్స్.. ఆస్ట్రేలియాలో షాకింగ్ పరిణామం
- భారత ఆటగాళ్ల చుట్టూ గుమికూడిన ఫ్యాన్స్
- ఆటగాళ్లపై అవమానకరమైన వ్యాఖ్యలు
- ఘాటుగా స్పందించిన బీసీసీఐ
ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రాక్టీస్ను చూడటానికి కొంతమంది అభిమానులు మాత్రమే ఆసక్తిచూపారు. అయితే భారత ప్రాక్టీస్ వైపు అభిమానులు పోటెత్తారు. ఎవరూ ఊహించని రీతిలో 3000 మంది వరకు వచ్చారు. ప్రాక్టీస్ చేస్తున్న నెట్స్ అభిమానులకు దగ్గరగా ఉండడంతో ఆటగాళ్లను ఇబ్బందిపెట్టారు. ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో గుమికూడడంతో ఆటగాళ్లు అసౌకర్యానికి గురయ్యారు. దీంతో మంగళవారం మధ్యలోనే ప్రాక్టీస్ సెషన్ను రద్దు చేసుకున్నారు.
ఈ పరిణామంపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. గందరగోళ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆస్ట్రేలియా ప్రాక్టీస్ సెషన్ వైపు దాదాపు ఒక 70 మంది కంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ కనపడలేదు. కానీ టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్నవైపు అనూహ్యంగా 3000 మంది వరకు వచ్చారని, ఇంత మంది అభిమానులు వస్తారని ఎవరూ ఊహించలేదని వెల్లడించారు. ఆటగాళ్లను ఉద్దేశించి మొరటుగా ప్రవర్తించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రాక్టీస్ సెషన్ను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లను సిక్సర్లు కొట్టాలని పదేపదే అడిగారని, మరో ఆటగాడి ఫిట్నెస్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కొంతమంది ప్రాక్టీస్ను ఫేస్బుక్ లైవ్ చేస్తూ కనిపించారు. గుజరాతీ భాషలో పలకరించాలంటూ ఓ ఆటగాడిని ఒక అభిమాని పదేపదే అడుగుతూ ఇబ్బందిపెట్టాడు.