BSNL: జియో, ఎయిర్‌టెల్‌కు కోటిమంది గుడ్‌బై.. బీఎస్ఎన్‌ఎల్‌లోకి పెరుగుతున్న వలసలు

Airtel Jio and Vi lose over one crore subscribers in September
  • టారిఫ్‌ల పెంపుతో ప్రైవేటు ఆపరేటర్లను వీడుతున్న సబ్‌స్క్రైబర్లు
  • సెప్టెంబర్ నెలలో కోటిమందికిపైగా గుడ్‌బై
  • అదే సమయంలో బీఎస్ఎన్ఎల్‌కు కొత్తగా 8.5 లక్షల మంది ఖాతాదారులు
  • ఇప్పట్లో టారిఫ్ ధరలు పెంచబోమన్న బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ దూసుకుపోతోంది. ఈ రంగంలో అడ్డూ అదుపు లేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియాకు షాకులు మీద షాకులిస్తోంది. సెప్టెంబర్ నెలలో ఈ మూడు సంస్థలు కలిసి కోటిమందికి పైగా ఖాతాదారులను కోల్పోగా, బీఎస్ఎన్‌ఎల్ గూటికి 8.5 లక్షల మంది కొత్తగా వచ్చి చేరినట్టు భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. 

దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థ అయిన జియో సెప్టెంబర్‌లో 79.69 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో ఆ సంస్థ వైర్‌లెస్ ఖాతాదారుల సంఖ్య 46.37 కోట్లకు పడిపోయింది. అదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వరుసగా 14.34 లక్షలు, 15.53 లక్షల మంది ఖాతాదారులను కోల్పోయాయి. ఫలితంగా ఎయిర్‌టెల్ యూజర్ బేస్ 38.34 కోట్లు, వొడాఫోన్ ఐడియా ఖాతాదారుల సంఖ్య 21.24 కోట్లకు పడిపోయింది. 

జులై నెలలో టారిఫ్ చార్జీలను 10 నుంచి 27 శాతానికి పెంచడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఖాతాదారులు ప్రైవేట్ టెలికం ఆపరేటర్లను వీడి బీఎస్ఎన్ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక, సెప్టెంబర్‌లో ప్రైవేటు ఆపరేటర్లు మొత్తంగా కోటిమందికిపైగా సబ్‌స్క్రైబర్లను కోల్పోగా బీఎస్ఎన్ఎల్ మాత్రం 8.49 కోట్ల మంది కొత్త ఖాతాదారులను చేర్చుకుంది. దీంతో ఆ సంస్థ వైర్‌లెస్ యూజర్ బేస్ 9.18 కోట్లకు పెరిగింది. ఇప్పట్లో టారిఫ్ పెంచే ఉద్దేశం లేదని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి స్పష్టం చేశారు.  

More Telugu News

BSNL
Reliance Jio
Airtel
Vodafone Idea
TRAI
Telecom News