నేటితో ముగియనున్న తెలంగాణ టెట్ దరఖాస్తు గడువు

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ రోజు (బుధవారం,20వ తేదీ)తో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు రాత్రి వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ టెట్‌కు లక్షన్నరకుపైగా దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది.  

అయితే టెట్ గడువును రెండు, మూడు రోజులు పొడిగించాలని బీఎడ్, డీఎడ్ అభ్యర్ధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం దరఖాస్తు స్వీకరణ గడువుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 
 
కాగా, ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను 2024 డిసెంబర్ 26న విడుదల చేయనున్నారు. పరీక్ష 2025 జనవరి 1నుంచి 20వరకు జరుగుతుంది. సెషన్ 1 ఉదయం 9గంటల నుంచి 11.30వరకు, సెషన్ 2 మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5న టీఎస్ టెట్ ఫలితాలు వెలువడనున్నాయి. 


More Telugu News