సుధీర్‌ వర్మ దర్శకత్వంలో 'గేమ్‌ ఛేంజర్‌' షూటింగ్‌? కారణం ఏమిటో తెలుసా?

  • సుధీర్‌ డైరెక్షన్‌లో 'గేమ్‌ ఛేంజర్‌' రెండో యూనిట్‌
  • హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  •  'గేమ్‌ ఛేంజర్‌'లో చరణ్‌ ద్విపాత్రాభినయం!
రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై 'దిల్‌'రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ నాయిక. 2025, జనవరి 10న సంక్రాంతి సీజన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇంకా ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ బ్యాలెన్స్‌ ఉండటంతో చిత్ర యూనిట్‌ రెండు యూనిట్‌లతో చిత్రీకరణను వేగవంతంగా పూర్తి చేసే పనిలో వున్నారు మేకర్స్‌. 

ఈ నెల 17 నుంచి  విజయవాడలో దర్శకుడు శంకర్‌ కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. అయితే ‌అదే సమయంలో మరో యూనిట్‌తో కూడా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ యూనిట్‌కు 'స్వామిరారా' ఫేం సుధీర్‌ వర్మ నిర్దేశకుడిగా వున్నట్టు తెలిసింది. ఇంతకు ముందు రెండో యూనిట్‌కు 'హిట్‌' చిత్ర దర్శకుడు శైలేష్‌ కొలను డైరెక్షన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 18 నుంచి సుధీర్‌ వర్మ దర్శకత్వంలో కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారని సమాచారం. 

శుభలేఖ సుధాకర్‌, ఎస్‌జే సూర్యలపై సీన్స్‌ను ఇక్కడ షూట్‌ చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో దర్శకుడు శంకర్‌ నిర్మాణానంతర పనుల కోసం చెన్నయ్‌కి వెళితే సెకండ్‌ యూనిట్‌ బాధ్యతలను సుధీర్‌ వర్మ కంటిన్యూ చేసే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల లక్నోలో 'గేమ్‌ ఛేంజర్‌' టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. 

ఇక త్వరలోనే దేశంలోని మరికొన్ని ముఖ్య ప్రాంతాల్లో ప్రమోషన్స్‌ కోసం టీమ్‌ పర్యటించనుంది. పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ఎలక్షన్‌ ఆఫీసర్‌గా చరణ్‌ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిసింది. నటుడు శ్రీకాంత్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతాన్ని అందించాడు. 


More Telugu News

Game changer Ramcharan Shankar dil raju sudheer varma Game changer update Rc16 Cinema