అన్నాడీఎంకే బంపర్ ఆఫర్... సభకు వస్తే కుర్చీ ఫ్రీ!

  • జనాలను సభకు రప్పించేందుకు అన్నాడీఎంకే కొత్త ఎత్తుగడ
  • సభకు రండి... కుర్చీ పట్టుకెళ్లండి అంటూ అనౌన్స్ మెంట్
  • సభకు వచ్చి... కుర్చీలు తీసుకెళ్లిన జనాలు
రాజకీయ సభలకు జనాలు వస్తేనే నిండుదనం వస్తుంది. అందుకే పార్టీలు బహిరంగ సభలకు ప్రజలను రప్పించడాన్ని ఓ సవాలుగా తీసుకుంటాయి. ఇతర పార్టీల కంటే తమ సభకు ఎక్కువ మంది వచ్చారని చూపించడానికి తహతహలాడుతుంటాయి. 

తాజాగా, తమిళనాడు విపక్షం అన్నాడీఎంకే సభకు జనాన్ని ఆకర్షించేందుకు వినూత్నమైన ఎత్తుగడ వేసింది. సభకు వస్తే కుర్చీ ఫ్రీ అని బంపర్ ఆఫర్ ప్రకటించింది. సభకు వచ్చిన వాళ్లు, సభ ముగిశాక కుర్చీ తీసుకెళ్లిపోవచ్చని వెల్లడించింది. 

తిరుపూర్ పెరుమానల్లూర్ లో అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. జనసమీకరణ బాధ్యతను అన్నాడీఎంకే అధిష్ఠానం స్థానిక నేతలకు అప్పగించింది. దాంతో, వారు ఈ సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని... "సభకు రండి, కుర్చీ పట్టుకెళ్లండి" అంటూ ఆఫర్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు 1,500 కుర్చీలను ఏర్పాటు చేశారు. దాంతో ఈ సమావేశానికి జనాలు భారీగా తరలివచ్చారు. సభకు హాజరై, ఎంచక్కా కుర్చీలను ఇంటికి పట్టుకెళ్లారు.

Chair Free
AIADMK
Meeting
Tamil Nadu

More Telugu News