ఇంతకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నట్లా లేనట్లా..?

  • మ్యాచ్ లు తమ దేశంలోనే నిర్వహిస్తామని పాక్ పట్టు
  • ఆ దేశానికి వెళ్లేది లేదని ఇప్పటికే తేల్చిచెప్పిన భారత్
  • ఏకంగా ట్రోఫీని రద్దు చేసే అవకాశం ఉందంటున్న ఐసీసీ వర్గాలు
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీకి సంబంధించిన మ్యాచ్ లన్నీ తమ దేశంలోనే జరగాలని, తామే నిర్వహిస్తామని పాక్ బోర్డ్ పట్టుబడుతోంది. అయితే, ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లేదిలేదని భారత్ ఇప్పటికే తేల్చిచెప్పింది. దీంతో భారత జట్టు ఆడే మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ తొలుత భావించింది. దీనికి పాక్ బోర్డ్ అంగీకరించకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ల షెడ్యూల్ ఇప్పటికీ ఖరారు కాలేదు. ఈ సందిగ్ధం నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేయాలని ఐసీసీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణకు ముసాయిదా షెడ్యూల్‌ను ఇప్పటికే ఐసీసీకి పీసీబీ అందజేసింది. దీనిప్రకారం చూస్తే.. ట్రోఫీ నిర్వహణకు ఎక్కువ సమయంలేదు. ఇప్పటికే వంద రోజుల కౌంట్ డౌన్ ప్రారంభం కావాల్సింది. ‘ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఆతిథ్య దేశం పాకిస్థాన్ తోపాటు ఈ టోర్నీలో పాల్గొనే జట్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. షెడ్యూల్ విషయంలో ఎదురవుతున్న ఆటంకాలపై చర్చిస్తున్నాం. షెడ్యూలింగ్ కుదరకుంటే టోర్నీని రద్దు చేయడమా లేక వాయిదా వేయడమా అనేది నిర్ణయిస్తాం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువరిస్తాం’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.

Champions Trophy 2025
ICC
Pakistan
PCB
Team India
UAE
Cricket

More Telugu News