Bike Silencers: విశాఖలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. 80 బైక్ సైలెన్సర్ల ధ్వంసం

Andhra Pradesh Police crushes 80 bike silencers to combat noise pollution
  • భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగించవద్దని పోలీస్ కమిషనర్ ఆదేశాలు
  • సైలెన్సర్ కు మాడిఫికేషన్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని వెల్లడి
  • బైక్ యజమానితో పాటు మెకానిక్ పైనా చర్యలు తీసుకుంటామని వార్నింగ్
ద్విచక్ర వాహనాలకు భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగించుకోవద్దని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వాహనదారులకు సూచించారు. సైలెన్సర్ మాడిఫికేషన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ మొత్తంలో ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బైక్ లకు అమర్చిన భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం కమిషనర్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం సమీపంలో సుమారు 80 సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు.

బైక్ సైలెన్సర్లలో మార్పులు చేర్పులు చేసి భారీ శబ్దం వచ్చేలా చేయడం సరికాదని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు. దీనివల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని వివరించారు. కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను మాత్రమే ఉపయోగించాలని వాహనదారులకు సూచించారు. సైలెన్సర్ కు మార్పులు చేస్తే బైక్ యజమానితో పాటు దానిని బిగించిన మెకానిక్ పైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్ యజమానికి 3 నెలల జైలు, రూ.10వేల వరకు జరిమానాతో పాటు 3 నెలలపాటు లైసెన్స్‌ రద్దు చేస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. బైక్ నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సీపీ శంఖబ్రత బాగ్చీ ఈ సందర్భంగా విశాఖ పౌరులకు తెలిపారు.

Bike Silencers
Vizag
Andhra Pradesh
AP Police
Road Roller

More Telugu News