డిసెంబరు చివరినాటికి అమరావతి పనులకు టెండర్లు: మంత్రి నారాయణ
- రూ.38 వేల కోట్లతో అమరావతి పనులకు టెండర్లు
- చీఫ్ ఇంజినీర్ల కమిటీ నివేదిక ఆధారంగా కార్యాచరణ
- ఐదు బెస్ట్ సిటీల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామన్న నారాయణ
జులై 24న చీఫ్ ఇంజినీర్లతో టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేశామని, రాజధాని పనులకు సంబంధించి చీఫ్ ఇంజినీర్ల కమిటీ అక్టోబరు 29న నివేదిక సమర్పించిందని చెప్పారు. ఇంజినీర్ల కమిటీ నివేదిక ప్రకారం సీఆర్డీఏ ముందుకు వెళుతుందని అన్నారు. ఈ క్రమంలో, డిసెంబరు చివరి నాటికి అమరావతికి సంబంధించి అన్ని టెండర్లు పిలవాలని ఆదేశించామని మంత్రి నారాయణ తెలిపారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు.
కాగా, రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు రూ.15 వేల కోట్ల రుణం ఇస్తుందని అన్నారు. నీరుకొండ, శాఖమూరు, కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కుల సామర్థ్యంతో కూడిన వాటర్ పంపింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
గత వైసీపీ సర్కారు రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడిందని నారాయణ విమర్శించారు. కానీ, కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు.