రూ.10 కోట్లు ఇవ్వాలని వ్యాపారికి బెదిరింపు... చోటారాజన్ ముఠా అరెస్ట్

Five Chhota Rajan gang members arrested in builder extortion case
  • ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని భాగస్వామికి బెదిరింపులు
  • అప్పటికే రూ.55 లక్షలు చెల్లించిన వ్యాపారి
ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరించిన కేసులో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ముఠాకు చెందిన ఐదుగురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ ఆర్థిక రాజధానిలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని భాగస్వామికి ఫోన్ చేసి రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. బెదిరింపులకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సదరు వ్యాపారస్తులు కొంతమొత్తం ఇచ్చినప్పటికీ బెదిరింపులు ఆగలేదు. దీంతో వారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చోటా రాజన్ ముఠాకు చెందిన నిందితులు వ్యాపారవేత్త నుంచి రూ.10 కోట్లు డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు. ఈ డబ్బుల కోసం పదేపదే ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిపారు. సదరు వ్యాపారి అప్పటికే రూ.55 లక్షలు చెల్లించారని, అయినా ఇంకా డబ్బు కావాలని వేధించడంతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

చోటా రాజన్ ముఠా సభ్యులు గణేశ్ రామ్ అలియాస్ డానీ, రెమీ ఫెర్నాండేజ్, ప్రదీప్ యాదవ్, మనీశ్ భరద్వాజ్, సతీశ్ యాదవ్ బెదిరింపులకు పాల్పడగా... పోలీసుల సూచన మేరకు, బాధితులు డబ్బులు ఇస్తుండగా బాంద్రా వెస్ట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఈ ముఠాను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
Go Back to Shorts
Chota Rajan
Mumbai
Police

More Telugu News