ఏపీ టిడ్కో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్

  • గూడులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కృషి చేస్తానని అజయ్ కుమార్ హామీ 
  • ఆయ‌న‌ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే లోకం మాధవి 
  • టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్‌ను అభినందించిన నేతలు
ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) చైర్మన్‌గా జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్ విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోని టిడ్కో ఆఫీసులో బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. పట్టణ, నగర ప్రాంతాల్లోని గూడులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కృషి చేస్తానన్నారు. 

నా మీద నమ్మకంతో చాలా ప్రతిష్ఠాత్మకమైన పదవిని ఇచ్చినందుకు నమ్మకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తానని అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి నారాయణలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. పట్టణాల్లో అర్హులైన పేదలందరికీ టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్‌ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పదవులు పొందిన వారు స్ఫూర్తివంతంగా నిర్వహించాలన్నారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడి ప్రభాకర్ రెడ్డి, జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అజయ్ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. 

TIDCO
Veulapati Ajay Kumar
Vijayawada

More Telugu News