బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

  • బంగ్లాలో హిందువులు అకృత్యాలు ఎదుర్కొంటున్నారన్న ఆర్ఎస్ఎస్ చీఫ్
  • భారత ప్రభుత్వ సాయం కీలకమని వ్యాఖ్య
  • బలహీనంగా ఉన్నంతకాలం దాడులు జరుగుతూనే ఉంటాయన్న మోహన్ భగవత్
దసరా ఉత్సవాల వేళ పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఖండించారు. బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల సాయం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం సాయం చేయడం వారికి చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. బలహీనంగా ఉండడం నేరమవుతోందని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ‘‘మనం బలహీనంగా ఉన్నామంటే నేరాలను ఆహ్వానిస్తున్నట్టే. మనం ఎక్కడ ఉన్నా ఐక్యంగా, సాధికారికంగా ఉండాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం జరిగిన ఓ దసరా ఉత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆయన స్పందించారు. 

బంగ్లాలో హిందువులు అకృత్యాలను ఎదుర్కొంటున్నారని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ‘‘ మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో ఏం జరిగింది? అందుకు కొన్ని తక్షణ కారణాలు ఉండవచ్చు. కానీ సంబంధించినవారు దీనిపై చర్చిస్తారు. దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ హిందువులపై అఘాయిత్యాలకు పాల్పడడం అక్కడ పునరావృతమవుతోంది. అయితే తొలిసారి హిందువులు వారి రక్షణ కోసం ఐక్యంగా వీధుల్లోకి వచ్చారు. బంగ్లాదేశ్‌లో ఇదే విధంగా దాడులు కొనసాగితే హిందువులే కాదు, అక్కడి మైనారిటీలు అందరూ ప్రమాదంలో పడతారు’’ అంటూ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు.

Mohan Bhagwat
RSS
Bangladesh
Atrocities against Hindus

More Telugu News