తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన జగన్

  • ఏపీ, తెలంగాణ ప్రజలకు జగన్ పండుగ శుభాకాంక్షలు
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ బాగుండాలన్న వైసీపీ అధినేత
  • అమ్మవారి కటాక్షం ప్రతి ఒక్కరికీ లభించాలని ఆకాంక్ష
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పర్వదినాలను పురస్కరించుకుని ఏపీ, తెలంగాణ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 

లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి సాధించిన విజయానికి, దుష్ట శక్తులపై దైవ శక్తుల గెలుపునకు ప్రతీకగా జరుపుకునే పండుగ దసరా అని జగన్ వివరించారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా... మంచితనాన్నే అంతిమ విజయం వరిస్తుందని పేర్కొన్నారు. 

ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరిసంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని... ఆ కనకదుర్గమ్మ దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని జగన్ ఆకాంక్షించారు.

Jagan
Dasara
Andhra Pradesh
Telangana
YSRCP

More Telugu News