Pakistan vs England: 147 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. ఇంగ్లండ్‌ చేతిలో పాకిస్థాన్‌కు అవమానకర ఓటమి

ఇటీవలే స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్‌ క్రికెట్ జట్టుకు మరో అవమానకరమైన ఓటమి ఎదురైంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఏకంగా ఇన్నింగ్స్‌, 47 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు సాధించినప్పటికీ ఈ ఘోర ఓటమి ఎదురైంది. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 556 పరుగుల స్కోరు చేయగా.. పర్యాటక జట్టు ఇంగ్లండ్ ధీటుగా సమాధానం ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 823 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 267 పరుగుల ఆధిక్యాన్ని ఇంగ్లండ్ సాధించింది. ఇక రెండవ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 220 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్, 47 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై జయకేతనం ఎగురవేసింది.

కాగా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 500లకు పైగా పరుగులు సాధించి ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి. దీంతో పాకిస్థాన్‌కు అవమానకరమైన ఓటమి ఎదురైంది. అవాంఛనీయ రికార్డు నమోదైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 500 పరుగులకు పైగా స్కోర్ చేసి కూడా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన మొట్టమొదటి జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది.

కాగా ముల్తాన్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. జో రూట్ డబుల్ సెంచరీ సాధించగా, హ్యారీ బ్రూక్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదాడు. వీరిద్దరూ కలిసి రికార్డు స్థాయి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 500లకు పైగా సాధించడంలో అబ్దుల్లా షఫీక్‌, కెప్టెన్‌ షాన్‌ మసూద్‌, అఘా సల్మాన్‌ కీలక పాత్ర పోషించారు. వీరు ముగ్గురూ సెంచరీలతో కదం తొక్కారు. కాగా ట్రిపుల్ సెంచరీతో రాణించిన హ్యారీ బ్రూక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Pakistan vs England
Cricket
Cricket Records
Multan Test

More Telugu News