వీధుల్లో నుంచి పని చేసేందుకు కూడా సిద్ధమే: ఢిల్లీ సీఎం అతిశీ

BJP can enjoy the bungalow we live in people hearts says Atishi
  • ముఖ్యమంత్రి నివాసాన్ని ఇటీవల సీల్ చేసిన అధికారులు
  • తన వస్తువులు ఉన్నచోట కూర్చొని ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం అతిశీ
  • ప్రజల సానుభూతి కోసమే ఆప్ డ్రామాలు ఆడుతోందని బీజేపీ విమర్శ
  • ఆమ్ ఆద్మీ పార్టీకి కార్లు, బంగ్లాలు అవసరం లేదన్న సీఎం అతిశీ
తాను, ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అవసరమైతే వీధుల్లో పని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ అన్నారు. తమ పార్టీ... బంగ్లాలు, కార్ల కోసం రాజకీయాలు చేయదన్నారు. అవసరమైతే తమ పార్టీ వీధిల్లో నుంచే పని చేస్తుందన్నారు. అతిశీ అధికారిక నివాసానికి అధికారులు సీల్ వేసి, ఆమె వస్తువులను తరలించినట్టు ఆప్ ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో అతిశీ తన వస్తువులు ఉన్నచోట కూర్చొని ఫైల్స్‌పై సంతకాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమ్ ఆద్మీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. ఇలాంటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల్లో సానుభూతి కోసం ఆమ్ ఆద్మీ పార్టీ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నట్లుగా ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని బంగ్లా ఢిల్లీ సీఎం అధికారిక నివాసం కాదన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ సచివాలయంలోని తన ఛాంబర్ నుంచి పని చేయాలని, కానీ ఇలా ఖాళీ పెట్టెలతో ఉన్నచోట ఫైళ్లపై సంతకాలు పెట్టడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దారుణమని బీజేపీ మండిపడింది.

బీజేపీ వ్యాఖ్యలపై అతిశీ స్పందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేమనే ఉద్దేశంతో బీజేపీ భవనాలు ఖాళీ చేయించే కుటిల యత్నాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రెండంకెల సీట్లు కూడా రావన్నారు.

తమ పార్టీని చీల్చేందుకు గతంలో బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు. తమ పార్టీ నేతలను జైళ్లకు పంపినా బీజేపీకి ఫలితం దక్కలేదన్నారు. బీజేపీ బంగ్లాలు, కార్లను ఎంజాయ్ చేయవచ్చని, తాము మాత్రం ఢిల్లీ ప్రజల మనసులు గెలుచుకుంటామన్నారు.
Go Back to Shorts
Atishi
BJP
AAP
New Delhi

More Telugu News