హీరోయిన్ జెత్వానీ కేసు.. ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో స్వల్ప ఊరట

  • జెత్వానీ కేసులో ఏ6గా ఉన్న విశాల్ గున్నీ
  • ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన గున్నీ
  • అక్టోబర్ 1 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు
ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. విశాల్ గున్నీపై అక్టోబర్ 1వ తేదీ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది. 

జెత్వానీ కేసులో కీలక నిందితుడిగా (ఏ1) ఉన్న కుక్కల విద్యాసాగర్ కు కోర్టు ఇప్పటికే 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను చేర్చారు. ఏ2గా పీఎస్సార్ ఆంజనేయులు, ఏ3గా కాంతి రాణా, ఏ6గా విశాల్ గున్నీ ఉన్నారు. ఏ4గా వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ పేర్లను చేర్చారు. ఈ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వీరు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.


More Telugu News

Jetwani Tollywood Bollywood Vishal Gunni IPS AP High Court