పవన్ మరో ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని చూస్తున్నారు: అంబటి రాంబాబు
- విజయవాడ వరదల నేపథ్యంలో కూటమి వర్సెస్ వైసీపీ
- బుడమేరు పరీవాహక ప్రాంతాన్ని ఆక్రమించారన్న పవన్
- చంద్రబాబు నివాసం కూడా బఫర్ జోన్ లోనే ఉందన్న అంబటి రాంబాబు
- చంద్రబాబు నివాసాన్ని కూల్చి శభాష్ అనిపించుకోవాలని పవన్ కు సూచన
పవన్ కల్యాణ్ మరో ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని చూస్తున్నారని విమర్శించారు. బుడమేరు మొత్తం ఆక్రమించారని పవన్ అంటున్నారని, కానీ పవన్ ముందు చంద్రబాబు నివాసంపై నిర్ణయం తీసుకోవాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నివాసం బఫర్ జోన్ లో ఉందని, చంద్రబాబును కరకట్ట నివాసం నుంచి ఖాళీ చేసి పంపించాలని పవన్ కు సవాల్ విసిరారు. బఫర్ జోన్ లో ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూల్చివేసి శభాష్ అనిపించుకోవాలని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు వచ్చాయని, కానీ జగన్ వల్లే వరదలు వచ్చాయన్నట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరదలు వచ్చిన వెంటనే పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని అంబటి రాంబాబు నిలదీశారు. చంద్రబాబు నివాసం నీట మునగడంతో పవన్ కు వరదలు గుర్తొచ్చాయని, జగన్ విజయవాడ వచ్చాక గానీ పవన్ లో చలనం రాలేదని ఎద్దేవా చేశారు.