భారీ వర్షాల సమీక్షల కారణంగా బాలయ్య కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నా: సీఎం చంద్రబాబు

CM Chandrababu says he can not attend to Balakrishna golden jubilee event
  • నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ కు 50 ఏళ్లు
  • హైదరాబాదులో గోల్డెన్ జూబ్లీ వేడుక
  • ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు
  • ఏపీలో భారీ వర్షాలు, వరదలు... సమీక్షలతో చంద్రబాబు బిజీ
హైదరాబాదులో నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుక ప్రారంభమైంది. బాలయ్య సినీ కెరీర్ కు 50 ఏళ్లు నిండిన నేపథ్యంలో, ఈ స్వర్ణోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. 

అయితే ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా చంద్రబాబు పరిస్థితిని సమీక్షించడంలోనూ, వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనలతోనూ బిజీగా ఉన్నారు. దాంతో, ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాంటూ ఓ సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంటున్న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు. ఏపీలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నందున... హైదరాబాదులో జరుగుతున్న కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను. 

నందమూరి బాలకృష్ణ మరెన్నో విజయాలు సాధించాలని, తెలుగు చిత్రసీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా మరిన్ని పాత్రలు పోషించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Advertisement
Chandrababu
Balakrishna
Golden Jubilee Event
Hyderabad
Andhra Pradesh

More Telugu News