160 కి.మి. వేగంతో ఢీ కొట్టిన కారు.. అమెరికాలో భారత సంతతి కుటుంబం మృత్యువాత

Indian Origin Family Killed In Car Crash In USA
  • కూతురును కాలేజీలో చేర్పించేందుకు వెళుతుండగా ప్రమాదం
  • భార్యాభర్తలతో పాటు కూతురు కూడా దుర్మరణం
  • రెండు కార్లు ఢీ కొనడంతో ఎగిసిపడ్డ మంటలు
అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కారు మరో కారును ఢీకొట్టింది. దీంతో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం మృత్యువాత పడింది. భార్యాభర్తలతో పాటు పదిహేడేళ్ల కూతురు కూడా దుర్మరణం చెందింది. ఈ ప్రమాదంలో రెండు కార్లలోని మొత్తం ఐదుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

భారత సంతతికి చెందిన అర్వింద్, ప్రదీప దంపతులు తమ కూతురు అండ్రిల్ (17) ను నార్త్ టెక్సాస్ లోని యూనివర్సిటీ ఆఫ్ డల్లాస్ లో చేర్చేందుకు కారులో బుధవారం తెల్లవారుజామున బయలుదేరారు. గంటకు 112 కిలోమీటర్ల వేగంతో వారి కారు దూసుకెళుతోంది. ఈ క్రమంలోనే లాంపాస్ కౌంటీ సమీపంలో మరో కారు వేగంగా దూసుకొచ్చి వీరి కారును ఢీ కొట్టింది. బుధవారం ఉదయం 5:45 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు చాలా బలంగా ఢీ కొట్టడంతో మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో అర్వింద్, ప్రదీప, అండ్రిల్ అక్కడికక్కడే చనిపోయారు. వారి కారును ఢీ కొట్టిన కారులో ఇద్దరు ప్రయాణికులు ఉండగా.. వారు కూడా చనిపోయారని పోలీసులు తెలిపారు.
 
ప్రాణాలతో మిగిలిన కొడుకు
కారు ప్రమాదంలో తల్లిదండ్రులు, సోదరి చనిపోవడంతో అదిర్యాన్ (14) ఒంటరివాడయ్యాడు. అండ్రిల్ ను కాలేజీలో చేర్పించేందుకు తల్లిదండ్రులతో పాటు వెళ్లకుండా ఇంట్లో ఉండడంతో మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. ఒంటరివాడైన అదిర్యాన్ ను ఆదుకోవడానికి అర్వింద్, ప్రదీపల స్నేహితులు ‘గో ఫండ్ మీ’ ద్వారా ఇప్పటి వరకు 7 లక్షల డాలర్ల విరాళాలు సేకరించారు.
Go Back to Shorts
USA Road Crash
Indian Family dead
America
Road Accident

More Telugu News