ఎల్లుండి వయనాడ్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఏరియల్ సర్వే

ప్రధాని నరేంద్రమోదీ కేరళలోని వయనాడ్ జిల్లాలో పర్యటించనున్నారు. వరద, కొండచరియలు విరిగిన ప్రాంతంలో ఈ నెల 10న ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆ రోజున 12 గంటలకు సందర్శిస్తారు. అనంతరం సహాయక శిబిరాలను సందర్శిస్తారు.

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రత్యేక విమానంలో కన్నూర్ విమానాశ్రయానికి చేరుకొని, ఐఏఎఫ్ హెలికాప్టర్‌లో వయనాడ్‌కు వెళతారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు. వయనాడ్ విపత్తును పర్యవేక్షిస్తున్న కేరళ కేబినెట్ సబ్ కమిటీ, జిల్లా యంత్రాంగం మోదీకి స్వాగతం పలుకుతుంది.

ఈరోజు అడ్వాన్స్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బృందం వయనాడ్‌ను సందర్శించింది. మోదీ హెలికాప్టర్ కోసం సేఫ్ ల్యాండింగ్ జోన్‌ను పరిశీలించింది. ప్రధాని పర్యటనను క్రమబద్ధీకరించేందుకు కేరళ పోలీసులు ఎస్పీజీతో సన్నిహితంగా సమన్వయం చేసుకున్నారు.


More Telugu News