నందమూరి లక్ష్మీపార్వతికి చంద్రబాబు సర్కార్ షాక్.. ఆ హోదా తొలగింపు!

వైఎస్ జగన్ హయాంలో తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన నందమూరి లక్ష్మీ పార్వతికి చంద్రబాబు సర్కార్ షాకిచ్చింది. జగన్ సర్కార్‌లో ఆమె తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీ ఆమెకు ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాను కట్టబెట్టింది. రాష్ట్రంలో అధికార మార్పిడి తరువాత వైఎస్ జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారులపై చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతోంది.

ఈ క్రమంలో ఆంధ్రా యూనివర్శిటీ .. లక్ష్మీపార్వతి విషయంలో కీలక ప్రకటన విడుదల చేసింది. గతంలో ఆమెకు కేటాయించిన ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాను ఉపసంహరించుకున్నట్టు పేర్కొంది. ఈ మేరకు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎన్.కిశోర్ బాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకూ లక్ష్మీపార్వతికి యూనివర్శిటీ నుండి వేతనం చెల్లించలేదని ఆయన తెలియజేశారు. గతంలో ఆమె తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో యూనివర్శిటీ పరిశోధకులకు మార్గదర్శకం (గైడ్) అందించే బాధ్యత ఇచ్చారు. అయితే తాజాగా ఈ విధుల నుండి కూడా ఆమెను తప్పించినట్లు వెల్లడించారు. ఆమె వద్ద మార్గదర్శకం కోసం చేరిన రీసెర్చ్ స్కాలర్స్‌ను (పరిశోధకులను) తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్‌కు (ఆచార్యునికి) మార్పు చేయాలని ఆదేశించామని యూనివర్శిటీ రిజిస్ట్రార్ కిశోర్ బాబు వెల్లడించారు.

Lakshmi Parvathi
andhra university
Visakhapatnam
Andhra Pradesh

More Telugu News