256కు పెరిగిన వయనాడ్ విలయం మృతుల సంఖ్య.. పొంచి ఉన్న మరో ప్రమాదం

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 256కు చేరుకుంది. మరో 220 మంది ఆచూకీ గల్లంతైంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ అధికారులు ఇప్పటి వరకు 1000 మందిని రక్షించారు. 

భారీ వర్షాల కారణంగా ముండక్కై, చూరమల, అత్తమల, నూల్‌పుళ గ్రామాల్లో మంగళవారం మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ మూడు గ్రామాలు శవాల దిబ్బలుగా మారాయి. కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఎటుచూసినా శవాలే కనిపించాయి. దాదాపు 1500 ఆర్మీ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఫోరెన్సిక్ సర్జన్లను కూడా మోహరించినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు. 

బాధితులను రక్షించేందుకు చూరమలలో ఆర్మీ ఇంజినీర్ టాస్క్‌ఫోర్స్ బృందం తాత్కాలిక వంతెన నిర్మించింది. సహాయ కార్యక్రమాల్లో డాగ్ స్క్వాడ్‌లు కూడా పాలుపంచుకుంటున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేడు వయనాడ్ సందర్శిస్తారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో మరోమారు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ హెచ్చరికలు జారీచేసింది. వయనాడ్‌, ఇతర జిల్లాల్లో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. వయనాడ్ విలయంపై అమెరికా, రష్యా, చైనా, ఇరాన్ తదితర దేశాలు స్పందిస్తూ, మరణాలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

Wayanad
Landslides
Kerala
NDRF
Indian Army

More Telugu News