జీఎస్టీ కుంభకోణంలో 5వ నిందితుడిగా మాజీ సీఎస్ సోమేశ్‌ కుమార్

Case registered against Somesh Kumar in GST Scam
  • కేసు నమోదు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు
  • తెలంగాణ వాణిజ్య శాఖ జాయింట్‌ కమిషనర్‌ ఫిర్యాదు ఆధారంగా కేసు
  • ఇప్పటికే నిందితులుగా ఉన్న పలువురు
జీఎస్టీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ను పోలీసులు 5వ నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పన్ను ఎగవేతదార్లకు సహకరించడంతో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ ఆ శాఖ జాయింట్‌ కమిషనర్‌ రవి కానూరి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదయిన విషయం తెలిసిందే. వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్‌ ఎస్‌వీ కాశీ విశ్వేశ్వర రావు, డిప్యూటీ కమిషనర్‌(హైదరాబాద్‌ రూరల్‌) శివ రామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శోభన్‌బాబు, ప్లియాంటో టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌ను ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా చేర్చారు. 

కాగా వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక్క తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎగవేత ద్వారా ఏకంగా రూ.1,000 కోట్లకుపైగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. మరో 11 ప్రైవేటు సంస్థలు దాదాపు రూ. 400 కోట్ల పన్ను చెల్లింపులు ఎగవేసినట్టు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు మానవ వనరులను అందించే ‘బిగ్‌లీప్‌ టెక్నాలజీస్‌ అండ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఏమాత్రం టాక్స్‌ కట్టకుండానే ఏకంగా రూ.25.51 కోట్ల ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ తీసుకుందని, అవకతవకలు జరిగాయని తేలిన నేపథ్యంలో అంతర్గతంగా విచారణ జరిపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

వాణిజ్య పన్నులశాఖకు సాంకేతికతను అందించే సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఐఐటీ హైదరాబాద్‌ వ్యవహరించింది. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్‌ల్లో అక్రమాలను గుర్తించడంతోపాటు డేటాను విశ్లేషించడం సర్వీస్‌ప్రొవైడర్‌ చేయాల్సిన పని. పన్నుచెల్లింపుదారుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్‌ ప్రొవైడర్‌ రూపొందించిన ‘స్క్రూటినీ మాడ్యూల్‌’ గుర్తించాల్సి ఉంటుంది. కానీ బిగ్‌లీప్‌ టెక్నాలజీస్‌ అక్రమాలను ఐఐటీ హైదరాబాద్‌ అందిస్తున్న ఐఐటీ హైదరాబాద్ ‘స్క్రూటినీ మాడ్యూల్’ కూడా గుర్తించలేకపోయిందని వివరించారు.
Go Back to Shorts
Somesh Kumar
Telangana
GST Scam

More Telugu News