సీనియర్ నటి పావలా శ్యామలకు ఆర్థికసాయం అందించిన మెగా హీరో సాయి దుర్గా తేజ్

టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల గత కొన్నాళ్లుగా అనారోగ్యం, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చాలావరకు ఆమె దాతల సాయంపైనే బతుకు వెళ్లదీస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెకు సాయం అందించారు. 

తాజాగా, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కూడా పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేశారు. సాయి దుర్గా తేజ్ సినీ జర్నలిస్టులకు రూ.5 లక్షల విరాళం ఇవ్వగా, అందులో ఒక లక్ష రూపాయలు పావలా శ్యామలకు కేటాయించారు. తనకు సాయి దుర్గా తేజ్ ఆర్థిక సాయం చేయడం పట్ల పావలా శ్యామల కృతజ్ఞతలు తెలియజేశారు.

సాయి తేజ్ తనకు సాయం చేస్తానని చాలాకాలం కిందటే మాటిచ్చాడని, కానీ ఆ తర్వాత ఆయనకు యాక్సిడెంట్ కావడంతో ఆ విషయం మర్చిపోయి ఉంటాడని అనుకున్నామని, కానీ ఇప్పటికీ ఆ విషయం గుర్తుపెట్టుకని సాయం అందించడం ఆయన మంచితనానికి నిదర్శనం అని పావలా శ్యామల కొనియాడారు. 

ఈ సందర్భంగా సాయి తేజ్ ఆమెతో వీడియో కాల్ మాట్లాడారు. ఓ దశలో తాము బతకలేక చనిపోదాం అనుకున్నామని, కానీ మెగాస్టార్ చిరంజీవి వంటి వారు ఆదుకున్నారని శ్యామల వెల్లడించారు. మా అమ్మాయికి కూడా కాలు విరిగింది... దాంతో మాకు బతకాలన్న ఆశ పోయింది... చచ్చిపోదాం అనుకున్నాం అని ఆమె వాపోయారు. 

ఊరుకోండమ్మా... మీరు అలా అనకూడదు... మేమంతా ఉన్నాం కదా అని సాయి తేజ్ ఓదార్పు వచనాలు పలికారు. సాయితేజ్ గారూ మీకు యాక్సిడెంట్ అయినప్పుడు... మీరు బతకాలని ఆ దేవుడ్ని ప్రార్థించాం... దేవుడి దయవల్ల మీరు క్షేమంగా తిరిగి వచ్చారు అని పావలా శ్యామల సాయి తేజ్ తో అన్నారు. అందుకు సాయి తేజ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Sai Durga Tej
Pavala Shyamala
Donation
Senior Actress
Tollywood

More Telugu News