ఇంటికి వీడియో కాల్ చేసి ఏడ్చేసిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో ఇదిగో
- ఇదే చివరి వరల్డ్ కప్ అని ప్రకటించిన విరాట్ కోహ్లీ
- భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచాక భావోద్వేగం
- కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఎమోషనల్ అయిన విరాట్
వీడియో కాల్ చేసిన వెంటనే విరాట్ కన్నీళ్లు పెట్టాడు. అయితే కొద్ది క్షణాల్లో భావోద్వేగాన్ని అణుచుకొని పిల్లలను నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చెలరేగాడు. 59 బంతుల్లో 76 పరుగులు బాది ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
కాగా ఇదే తన చివరి టీ20 వరల్డ్ కప్ అని ఫైనల్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ప్రకటించాడు. తాము అనుకున్నది సాధించామని అన్నాడు. ఇక పరిగెత్తలేమని ఏదో ఒక రోజు అనిపిస్తుందని, తన విషయంలో అదే జరిగిందని, దేవుడు నిజంగా చాలా గొప్పవాడు అంటూ విరాట్ వ్యాఖ్యానించాడు. ఇదే తగిన సందర్భం అని, ఇంతకుమించిన మంచి సందర్భం మరొకటి ఉండదని అన్నాడు. ఒకవేళ టీ20 వరల్డ్ కప్ గెలవకపోయుంటే ఈ నిర్ణయం ప్రకటించకపోయేవాడినేమో అని విరాట్ పేర్కొన్నాడు.
తదుపరి తరం యువ ఆటగాళ్లకు ఇక అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని, యువ క్రికెటర్లు భారత జాతీయ పతాకం రెపరెపలాడించి, జట్టును ఇక్కడి నుంచి మరింత ముందుకు తీసుకెళ్తారనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని విరాట్ ఆశాభావం వ్యక్తం చేశాడు.