కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం... ఆయనకు భయం పట్టుకుంది: బీఆర్ఎస్ అధినేత 'లేఖ'పై కాంగ్రెస్ నేతల ఫైర్

  • నరసింహారెడ్డి విచారణ వద్దన్నారంటే కేసీఆర్ అవినీతిని అంగీకరించినట్లేనని కోమటిరెడ్డి వ్యాఖ్య
  • విచారణలో తన పేరు ఉందని కేసీఆర్ బాధపడటంలో అర్థం లేదన్న అద్దంకి దయాకర్
  • తప్పులు బయటపడతాయనే భయం పట్టుకుందన్న మహేశ్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నరసింహారెడ్డి కమిషన్‌కు లేఖ రాసిన అంశంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

కేసీఆర్, జగదీశ్ రెడ్డిలు జైలుకు వెళ్లడం ఖాయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. నరసింహారెడ్డి విచారణ వద్దన్నారంటే కేసీఆర్ అవినీతిని అంగీకరించినట్లేనని వ్యాఖ్యానించారు. నరసింహారెడ్డి నిజాయతీకి మారుపేరని తెలిపారు. విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి పవర్ ప్లాంటులో రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

విచారణలో తన పేరు ఉందని కేసీఆర్ బాధపడటంలో అర్థం లేదని అద్దంకి దయాకర్ అన్నారు. ఆయనను బద్నాం చేయాలనే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. కేసీఆర్ తన హయాంలో ప్రభుత్వ సంస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని విభాగాల్లోనూ కేసీఆర్ ప్రమేయంతోనే కుంభకోణాలు జరిగాయన్నారు.

తప్పులు బయటపడతాయనే భయం కేసీఆర్‌కు పట్టుకుందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తప్పు చేయకపోతే కమిషన్ ముందు నిరూపించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోలు పెద్ద స్కాం అన్నారు. నిజానిజాలు ప్రజలకు తెలియాలన్నారు.

Congress
KCR
Komatireddy Venkat Reddy
BRS

More Telugu News