మరికొద్దిసేపట్లో టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు తొలి మ్యాచ్‌.. తుది జట్టుపై ఉత్కంఠ!

  • తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనున్న టీమిండియా
  • రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం
  • కోహ్లీ బ్యాటింగ్ చేయబోయే స్థానంపై అభిమానుల్లో ఆసక్తి
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియా నేడు (బుధవారం) తొలి మ్యాచ్ ఆడబోతోంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఆడబోయే తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరెవరిని జట్టులోకి తీసుకోబోతున్నాడనేది ఉత్కంఠగా మారింది. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్‌లలో ఓపెనింగ్ చేసేది ఎవరు? రెండవ స్థానంలో బ్యాటింగ్ చేయబోయేది ఎవరనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఇక సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లలో వికెట్ కీపర్‌గా అవకాశం దక్కేది ఎవరికి?, శివమ్ దూబే పాత్ర ఏమిటి? అనే సందేహాలు క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.

తుది జట్టు ఇదేనా?
ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులో ఆడే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఐర్లాండ్‌తో భారత్ ఆడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయాలు సాధించగా ఒక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. నేటి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.

T20 World Cup 2024
Team India
Cricket
Virat Kohli
Rohit Sharma

More Telugu News