Revanth Reddy: మెదక్‌లో బీజేపీని గెలిపించేందుకు హరీశ్ రావు సహకరించారు: రేవంత్ రెడ్డి ఆరోపణ

మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు హరీశ్ రావు సహకారం అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని... అందుకే 8 మంది ఎంపీలను ఇచ్చి ఆశీర్వదించారని పేర్కొన్నారు. వంద రోజుల పాలన తర్వాత తమకు 41 శాతం ఓట్లు వచ్చాయన్నారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో తాము గెలిచింది 3 సీట్లేనని... ఇప్పుడు 8 సీట్లు గెలుచుకున్నామన్నారు. బీఆర్ఎస్ ఏడు సీట్లలో డిపాజిట్ కూడా దక్కించుకోలేదని... ఆ ఏడు సీట్లను బీజేపీకి అవయవదానం చేసిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీకి సహకరించిందన్నారు. తెలంగాణలో వంద రోజుల గ్యారెంటీలను అమలు చేశామన్నారు. కాంగ్రెస్ ఆరు నెలల పాలన నచ్చితే ఓటు వేయాలని తాము ప్రజలకు పిలుపునిచ్చామని... అందుకే 8 మంది అభ్యర్థులను గెలిపించారన్నారు.
Revanth Reddy
Congress
BJP
Lok Sabha Election Results
Raghunandan Rao

More Telugu News