ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు.. ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఉత్తర్వులు

  • ఐదేళ్ల తర్వాత మళ్లీ పోస్టింగ్‌లోకి ఏబీ వెంకటేశ్వరరావు
  • ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
  • సాయంత్రం పదవీ విరమణ చేయనున్న ఏబీవీ
మొత్తానికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం ఫలించింది. తాజాగా ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది. గతంలోనూ ఆయనకు అదే పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మళ్లీ అదే పోస్టులో నియమించడం గమనార్హం. కాసేపట్లో చార్జ్ తీసుకోనున్న ఆయన సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు. 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీవీపై సస్పెన్షన్ వేటు పడింది. రక్షణ వ్యవహారాల పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌ను సమర్థించింది. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆయన ఆశ్రయించారు. చివరికి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను క్యాట్ ఎత్తివేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లగా, క్యాట్ ఉత్తర్వులను సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో ఏబీవీని విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం.. ఆ వెంటనే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

AB Venkateswara Rao
IAS
Andhra Pradesh

More Telugu News