Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ మారణకాండను ఏ సినిమాలోనూ చూపించి ఉండరు: బాధితుడు మాణిక్యాలరావు

Varla Ramaiah press meet along with Pinnelli brothers victim Manikyala Rao
  • పోలింగ్ రోజున పిన్నెల్లి స్వగ్రామం కండ్లకుంటలో దారుణకాండ
  • టీడీపీ ఏజెంట్ మాణిక్యాలరావుపైనా, అతడి కుటుంబీకులపైనా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి దాడి
  • స్వయంగా బాధితుడితో మాట్లాడించిన వర్ల రామయ్య

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు, టీడీపీ పోలింగ్ ఏజెంట్ మాణిక్యాలరావుతో కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ... మాచర్లను తన సామ్రాజ్యంగా భావించి పిన్నెల్లి సాగించిన దౌర్జన్యకాండ, అతని దుర్మార్గ చర్యలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని తెలిపారు. 

అతడు కానీ, అతడి తమ్ముడు (వెంకట్రామిరెడ్డి) కానీ, వాళ్ల అనుచరులు కానీ ఏవిధంగా వ్యవహరించారో, స్థానిక పోలీసు శాఖను ఏ విధంగా అసమర్థ  శాఖగా మార్చివేశారో వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఎప్పుడైతే పిన్నెల్లి అన్నదమ్ములు పరారీలో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసు శాఖ జూలు విదిల్చి కొంచెం ధైర్యం తెచ్చుకుందో చూసిన తర్వాత ప్రజలకు ధైర్యం వచ్చిందని, వారి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారని వర్ల రామయ్య వివరించారు. 

వారిలో ఒక బాధితుడు ఇవాళ మనతో ఉన్నాడని వెల్లడించారు. అతడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అతడి మాటల్లోనే వినాలని ఇక్కడికి రప్పించడం జరిగిందని వర్ల తెలిపారు. అతడి పేరు నోముల మాణిక్యాలరావు అని, ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని వివరించారు. 

ఈ సందర్భంగా  మాణిక్యాలరావు మాట్లాడుతూ... తాను టీడీపీ అభిమానినని, చంద్రబాబు అంటే ఇష్టం అని వెల్లడించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంతూరు కండ్లకుంట తన స్వగ్రామం అని మాణిక్యాలరావు తెలిపారు. పోలింగ్ రోజున కండ్లకుంటలో తాను టీడీపీ ఏజెంట్ గా బూత్ లో కూర్చున్నానని వెల్లడించారు. 

"నేను కండ్లకుంట గ్రామంలో పోలింగ్ బూత్ నెం.114లో టీడీపీ ఏజెంట్ గా కూర్చున్నాను. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నేరుగా పోలింగ్ బూత్ లోకి వచ్చి... ఏరా మాదిగ నాకొడకా... మాకు వ్యతిరేకంగా పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా కూర్చునేంత ధైర్యమా నీకు? ఎన్ని గుండెలు రా నీకు? మేమంటే నియోజకవర్గమే గడగడా వణికిపోతుంది... ఎంత ధైర్యంరా నీకు? అంటూ తీవ్రంగా దూషించాడు. 

అతడితో పాటు మరో ఆరుగురు వ్యక్తులు కూడా బూత్ లోకి వచ్చారు. వారిలో దేశిరెడ్డి నాసర్ రెడ్డి అనే వ్యక్తి... రేయ్ నా కొడకా... ఆయన చెబుతోంది నీకే.. వినిపిస్తోందా? ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది. నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తేలేదు... నీ శవం బయటికి వెళుతుంది. ఐదు గంటల్లోపు నిన్ను చంపి ఏట్లో పడేస్తాం నా కొడకా అని నానా మాటలు తిట్టారు. 

నేనేం తప్పు చేశాను... నాకున్న స్వేచ్ఛను ఉపయోగించుకుని ఏజెంట్ గా వచ్చాను అని ధైర్యంగా మాట్లాడాను. దాంతో, వెంకట్రామిరెడ్డి మళ్లీ మా ఊర్లో ఎన్ని గుండెల్రా నీకు అంటూ చొక్కా పట్టుకుని ఈడ్చే ప్రయత్నం చేశాడు. 

వెబ్ కాస్టింగ్ కెమెరా వద్దకు వెళ్లి నా సమస్యను అధికారులకు వివరిద్దామనుకుంటే ఉదయం నుంచి పోలింగ్ బూత్ లో కరెంటు సరఫరా లేదు. దాంతో  పోలింగ్ అధికారులను అడిగితే వారు నిశ్చేష్టులుగా నిలిచిపోయారే తప్ప ఏమీ చేయలేకపోయారు. వాళ్లను మేం ఎదిరించలేం బాబూ... అంటూ వారు నిస్సహాయతను వ్యక్తం చేశారు. 

పోలింగ్ బూత్ లో నాపై దాడిచేసిన వెంకట్రామిరెడ్డి, అతడి అనుచరులు నీ సంగతి తర్వాత చూస్తాంరా అంటూ నా ఇంటికి వెళ్లారు. అక్కడున్న నా భార్య, ఇద్దరు కుమారులపై దౌర్జన్యం చేశారు. వెంకట్రామిరెడ్డి నా పెద్ద కొడుకు చందును పొత్తి కడుపులో తంతే విలవిల్లాడిపోయాడు. అన్నను కొడుతుంటే భరించలేక నా చిన్న కొడుకు ఏయ్ అంటూ ముందుకు వచ్చాడు. 

దాంతో వెంకట్రామిరెడ్డి అనుచరులు నా చిన్నకొడుకును విచక్షణరహితంగా కొట్టారు. కొడుకులిద్దరినీ కొడుతుంటే నా భార్య చూడలేక అడ్డు వెళితే ఆమెను కూడా కొట్టారు. నా పెద్ద కొడుకును వీధుల్లో వెంట తరిమారు. మేం బతకాలని రాసిపెట్టి ఉంది కాబట్టి దేవుడు ఆ రోజున మమ్మల్ని కాపాడాడు. బూత్ లోనే ఉన్న కొందరు వెంకట్రామిరెడ్డి అనుచరులు... మా ఇంటి వద్ద నావాళ్లను కొడుతున్న దృశ్యాలను నాకు ఫోన్ లో వీడియో కాల్ లైవ్ లో చూపించారు. 

ఇంత భయానక చర్యలను దేశంలో ఎక్కడా చూడలేదు, ఏ సినిమాలోనూ ఇలాంటి దారుణకాండను చూపించలేదు. అక్కడున్న ట్రైనీ డీఎస్పీకి చెబితే ఆయన స్పందన అంతంతమాత్రంగానే ఉంది" అని వివరించారు. 

అనంతరం వర్ల రామయ్య స్పందిస్తూ... పిన్నెల్లి, ఆయన తమ్ముడు ఏవిధంగా మాచర్లను తమ సామ్రాజ్యంగా మార్చుకున్నారో అందరూ చూశారు కదా అని వివరించారు. ఏజెంటుగా కూర్చుంటే చంపేస్తారా అని ప్రశ్నించారు. 

కాగా, ఈ వ్యవహారంపై మంగళగిరి పీఎస్ లో ఫిర్యాదు చేయాలంటూ నోముల మాణిక్యాలరావుకు వర్ల రామయ్య సలహా ఇచ్చారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ కంప్లెయింట్ ను మాచర్లకు పంపిస్తారని, అక్కడ సిట్ వాళ్లు చూసుకుంటారని వివరించారు.

  • Loading...

More Telugu News